నాజర్ నవ్వు వెనుక కథ
తేవర్ మగన్ 1992 ( తెలుగు డబ్బింగ్ క్షత్రియ పుత్రుడు) సినిమా కు కల్ట్ స్టేటస్ ఉంది. అంతకు మునుపు కూడా గ్రామకక్షలు, గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, దాయాదుల మధ్య కక్షలు నేపధ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. దాయాదులమధ్య కొట్లాట సమస్యగా వచ్చిన ఈ సినిమా అలాంటి సినిమాలకు కొత్త నమూనాగా నిలిచింది. కులానికి చెందిన పాత్రల ద్వారా నేటివిటీని పెంచి ,ఆథెంటిసిటీ తెచ్చిన సినిమా తమిళంలో ఇదే మొదటిది కావచ్చు.
ఒకే తండ్రి బిడ్దలైన పెరియ తేవర్, చిన్న తేవర్ మధ్య శత్రుత్వం ఉంది . ఇరువురికి వారి వారి వర్గాలున్నాయి. పెరియ తేవర్పెద్దకొడుకు తండ్రిదగ్గర ఉన్నాడు. దురలవాట్లకు లోనై శక్తిహీనుడయ్యాడు. రెండవ కొడుకు శక్తివేల్ లండన్ చదువుకుని తన ప్రేయసితో కలసి ఊరికి వచ్చాడు . మదరాసులో హోటల్స్ పెట్టాలని అతని ఆలోచన . అతని భావి ప్రణాఌక తండ్రిని బాధ పెట్టింది.
ఊరిలో వర్గపోరు హెచ్చింది.పెరియ తేవర్ ప్రత్యర్ధులు బలపడుతున్నారు. అతను కొడుకును ఊరిలోనే ఉండి తన వర్గ సంక్షేమం చూడమన్నాడు. అనుకోని సంఘటనలతో పెరియ తేవర్ మరణించాడు.
అతని అంత్యక్రియలకు దాయాదులు హాజరయ్యారు. మరణించిన పెరియతేవర్ పెద్ద కొడుకు తాగి ఉన్న మత్తులో తండ్రికి తలకొరవి పెట్టలేక నేలపై కూలబడ్డాడు. అతని స్థితి ని చూస్తున్న చిన్న తేవర్ కొడుకు మయ తేవర్ నవ్వుకుంటున్నాడు . పెదనాన్న మరణం అతన్ని కదిలించలేదు. వరసకు సోద రుడయ్యే వ్యక్తి అసహాయత అతనికి అమితానందాన్నిస్తుంది . ఆస్తి, ఆధిపత్యం రక్తసంబంధీకుల మధ్య బంధాలను తెంపేస్తుంది. ఆ దాయాది పాత్ర ను నాజర్ ధరించాడు. 'నాజర్ నవ్వు' ఎన్నింటినో గుర్తు చేస్తుంది. ఆ నవ్వు పాతికేళ్ళుగా గుర్తుకొస్తునే ఉంటుంది.
*******
తేవర్ మగన్ సినిమా కథ ఒక సారి రాసినది కాదు. ఎప్పటినుండో కమల్ హసన్ తీయదలచుకున్న సబ్జెక్ట్ ఈ సినిమా గా ఎవాల్వ్ అయ్యింది. సినిమా పై 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల ప్రభావం అటుంచితే కమల్ హసన్ ను ఎంతగానో ఆకర్షించిన కన్నడ సినిమా 'కాడు' (1973) ప్రభావం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
ప్రపంచ సినిమా , ఫిల్మ్ సొసైటీల ద్వారా డెబ్భైలనాటికి కొందరికి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ సినిమాలో వాస్తవిక ధోరణిని అందుకున్న వారిలో గిరీష్ కర్నాడ్ ఒకడు. దర్శకునిగా, నటునిగా అతనిదో ప్రత్యేక ఒరవడి. 'కాడు' (అడవి) సినిమాను అదే పేరుతో వచ్చిన కన్నడ నవల ఆధారంగా తీసాడతను.
రెండు గ్రామాలు. వాటిని వేరుచేస్తూ ఒక అడవి. రెండు గ్రామాలమధ్య కొన్ని తప్పనిసరి సంబంధాలు. ఈ నేపధ్యం లో కథ సాగుతుంది. ఎనిమిదేళ్ళ పిల్లవాడు జరిగే సంఘటనలన్నింటినీ తన దృష్టికోణం నుండి చూస్తూ ఉంటాడు. గ్రామాల మధ్య కక్షలు, రక్తపాతం, తద్వారా పిల్లవానిలో కలిగే భయం అతని కి అంతకు ముందు అడవి పట్ల ఉండే భయాన్ని మించుతుంది. ఒకటి ప్రాకృతమైన భయం, రెండవది మనుషులు సృష్టించిన భయం.
ఈ సినిమాలో రెండుగ్రామాలకు చెందిన ఇద్దరు ప్రత్యర్దులు ఒక పంచాయితీలో కలుసుకోవాల్సి వచ్చింది. వారిద్దరిలో ఒకరు ఆ పంచాయితీలో ఆత్మ రక్షణలో పడ్డాడు. అతని స్థితి చూసి రెండో ఆయన పరిహాసం-క్రౌర్యం కలిపి నవ్వుకుంటుంటాడు. ఆ పాత్ర పేరు శివగంగ. పాత్రధారి 'లోకేశ్'.
అక్కడ నాకు తేవర్ మగన్ లో నాజర్ నవ్వుకు మూలం దొరికింది.
'కాడు ' సినిమా చూస్తుంటే పదేపదే తేవర్ మగన్ జ్ఞప్తికి వస్తుంటుంది. 1973 నాటి 'కాడు' సినిమాలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు 1992 నాటికి తేవర్ మగన్ సినిమాలో 'శక్తివేల్ ' గా మారాడు. 'కాడు' సినిమా లో ప్రధాన పాత్ర పేరు 'చంద్రె గౌడ' (ఇది కులాన్ని తెలియజేసేదే).
-ముళ్ళపూడి సుబ్బారావు
******
No comments:
Post a Comment