కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)
కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్నగానే ఉంటాయి. కొన్ని సినిమాల డైలాగ్ లను మాత్రమే చూసినపుడు యాభై పేజీల లోపే ఉంటాయి.
ప్రపంచసాహిత్యం లోని క్లాసిక్స్ చాలానే సినిమాలు గా వచ్చాయి. వార్ అండ్ పీస్,అన్నా కరేనినా, క్రైమ్ అండ్ పనిష్మెంట్, గు డ్ ఎర్త్ , టేల్ ఆఫ్ టు సిటీస్, ఫర్ హూమ్ డి బెల్స్ టోల్, గాన్ విత్ డి విండ్ వంటి పరిమాణ రీత్యా పెద్దవయిన నవలనుండి ది స్ట్రేంజర్ (ఆల్బర్ట్ కామూ ) వంటి అరవై పేజీల చిన్న నవలలూ ఇంచుమించు సమానమైన నిడివితో ఉన్న సినిమాలు గా వచ్చాయి.
‘ది స్ట్రేంజర్’ సినిమా చూస్తుంటే నవలను ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఉంటుంది. సినిమా చూసి నవల చదివితే ‘ సినిమా నవల’ గా అనిపిస్తుంది. అయితే ఇలా మూలాన్ని యధాతధంగా సినిమాగా చెప్పటం చాలా తక్కువసార్లు సాధ్యపడుతుంది. నవల సినిమా గా వచ్చినపుడు మూలపు వివరాలే కాక మూలపు సారాంశం కూడా కొన్ని సార్లు మారిపోతుంది. కొన్ని సార్లు కావాలని, కొన్ని సార్లు అనుకోకుండా కూడా ఈ మార్పు జరగవచ్చు.
కన్యాశుల్కం నాటకాన్ని సినిమా ఫ్రేమ్ లో కుదించటం లో ఉన్న అననుకూలతవల్ల చాలా మంది ఆ పని సంకల్పించి విరమించారు. ఆ తర్వాతైనా నిర్మాతలు సాహసించటానికి కారణం నాటకానికి ఉన్న గుర్తింపు సినిమాకు కమర్షియల్ గా ఉపయోగపడుతుందనే కానీ గురజాడ ఉద్దేశించిన నాటక ప్రయోజనాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళటం కాదు. అయితే సినిమా లో ప్రజారంజకత్వం కోసం అవసరమైన కళాత్మకత లోపించకుండా వారు చూసుకుంటారు . దానికోసం రచనలోని ముఖ్యాంశానికి భిన్నంగా కూడా పోతారు. ఆర్ కె నారాయణ్ తన నవల ‘గైడ్’ ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమాను చూసి తన కథ కాదన్నాడు.
*********
కన్యాశుల్కం నాటకాన్ని ‘భీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం ‘ గా శ్రీ శ్రీ అభివర్ణించాడు. నేను మొదటసారి సినిమా చూసినపుడు నాకది ‘హాస్యరస ప్రధానమైన ప్రమోదాంత సినిమా ‘ గాకనిపించింది.
సినిమా మీద పెద్ద విమర్శ దాని ముగింపు పైన. గీరీశం గురించి నిజాలు తెలుసుకున్న సౌజన్యారావు అతన్ని వెళ్ళ గొట్టటం తో నాటకం ముగుస్తుంది. అయితే సినిమా గిరీశం – బుచ్చమ్మ వివాహం తోనూ రామప్ప పంతులు మినహా మిగతావారంతా పరివర్తన పొందటంతో ముగుస్తుంది. ఇది పూర్తిగా నాటక ఉద్దేశానికి విరుద్ధమన్నది ఆ విమర్శ.
గురజాడ నాటకానని ఏమి ఉద్దేశించి రాశాడన్న దానిమీద విమర్శకుల భిన్నాభిప్రాయాలున్నాయి. రచయిత ఉద్దేశాలు నాటకం లో ప్రతిబింబించాయా అన్నది కూడా అందులో ఒక ప్రశ్న. ఇలాంటి నేపధ్యం లో సినిమా నాటక లక్ష్యానికి దోహదం చేసిందా లేదా అన్నది సినిమా విజయానికో పరాజయానికో కారణం కాకపోవచ్చు.
************
ఈ నాటకాన్ని సినిమా గా మార్చటం లో గొప్ప శ్రమఉంది.చిత్ర రచన లో చాలాచోట్ల సఫలత ఉంది. అప్రధాన (?) పాత్రలనుకున్నవాటిని పరిహరించటం వల్ల నాటకంలో ఉన్న కన్ఫ్యూజన్ సినిమాలో తగ్గింది. మొదటిలోనే పాత్రల పరిచయం, వాటిమధ్య సంబంధాలు చెప్పటం లో నేర్పు కనపడుతుంది.
నాటకంచదువుతున్నపుడు ఒక గాప్ లా అనిపించే విషయం ఒకటుంది. లుబ్ద అవధానులు తో తన కూతురు పెళ్ళికి తాంబో లాలు ఇచ్చేశానని అగ్ని హోత్రావధానులు అంటాడు. ఎవరి ద్వారా ఆపని జరిగిందనేది తెలియదు. లుబ్ద అవధానులు పెళ్ళి రామప్ప పంతులు ద్వారా జరుగుతుందని తెలుస్తుంది. అలా అయితే తాంబూలాలు రామప్ప పంతులద్వారానే జరిగుండాలి. కానీ నాటకం లో అగ్నిహోత్రావధానులు – రామయప్పం పంతులు చెరువు గట్టున కలుసుకున్నపుడు వారు ఒకరికొకరు అపరిచితులలానే కనిపిస్తారు. మరి పెళ్ళి కి మధ్య వర్తిత్వం జరిపిందెవరు?
సినిమా మొదటిలోనే పెళ్ళి మాటలు మాట్లాడి రామప్ప పంతులు, అగ్నిహోత్రావధానులు కు తాంబూలాలు ఇస్తాడు. చివరిలో చెరువు గట్టున కలిసినపుడు వారు పరిచయస్తులు లానే మాట్లాడుకుంటారు. ఈ చేర్పు చిత్ర రచనలో తీసుకున్న శ్రద్ధ ను తెలియజేస్తుంది.
********
-ముళ్ళపూడి సుబ్బారావు



No comments:
Post a Comment